మమ్మల్ని చులకనగా చూస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!

Jun 25 2025 1:31 AM | Updated on Jun 25 2025 1:31 AM

మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!

మమ్మల్ని చులకనగా చూస్తున్నారు!

నల్లగొండ టూటౌన్‌ : పట్టణాల్లో సమభావన సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించేందుకు వార్డుల్లో నియమించిన మెప్మా రిసోర్స్‌ పర్సన్లపై మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న సీఓ (కమ్యూనిటీ ఆర్గనైజర్లు)లు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆర్పీలు మనోవేదన చెందుతున్నారు. నెలకు రూ.6వేల గౌరవ వేతనంతో పనిచేసే వారిపై చులకన భావంతో మాట్లాడుతూ హేళన చేయడం పరిపాటిగా మారిందని పలువురు ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలగిరి మున్సిపల్‌ కార్యాలయంలోని మెప్మా విభాగం ఉద్యోగులు కార్యాలయం గడప దాటకుండా అన్ని పనులూ ఆర్పీలతోనే చేయిస్తూ వారిని ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉద్యోగుల కర్ర పెత్తనం

మెప్మా ఉద్యోగులు పట్టణాల్లో మహిళలను సమావేశ పర్చడం, వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, బ్యాంకుల్లో రుణాలు ఇప్పించడం, ఇప్పించిన రుణాలను తిరిగి చెల్లించేలా చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. కానీ అన్ని పనులు వార్డుల్లో ఉన్న మహిళా ఆర్పీలపై నెట్టివేసి మెప్మాలోని ఇద్దరు ఉద్యోగులు వారిపైనే కర్ర పెత్తనం చెలాయిస్తూ సూటి పోటి మాటలతో మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలపై మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి ఐదు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా చిన్న పిల్లలను నిలబెట్టినట్లు నిలబెట్టి కారణాలు చెప్పండంటూ వికృత చేష్టలకు దిగుతున్నట్లు సమాచారం. మెప్మా కార్యాలయంలోని ఓ కీలక ఉద్యోగి మహిళా ఆర్పీలను ‘బొంద పెట్ట, దినం చెయ్య.. పిండాలు పెట్ట’ అని వ్యాఖ్యలు చేస్తూ వారిని మానసికంగా వేధిస్తున్నట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెప్మా కార్యాలయంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపాలిటీలోని ఓ ఇద్దరు, ముగ్గురు మెప్మా ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పద్ధతి ప్రకారం వ్యవహరించాలి

ఆర్పీలపై అమార్యాదగా మాట్లాడినా, పద్ధతి ప్రకారం వ్యవహరించకున్నా సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటాం. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలి. తదుపరి విచారణ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– సయ్యద్‌ ముసాద్‌ అహ్మద్‌,

మున్సిపల్‌ కమిషనర్‌

ఫ అన్ని పనులూ మాతోనే చేయిస్తున్నారని

మెప్మా మహిళా ఆర్పీల మనోవేదన

ఫ ఉద్యోగులు.. మాపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణ

ఆర్పీపై పేపర్లు విసిరేసిన మెప్మా ఉద్యోగి..

ప్రతి పది మంది మహిళలు గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతా తెరుస్తారు. వారిని గ్రూప్‌గా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మెప్మా ఉద్యోగులదే. సీఓలే వార్డులకు వెళ్లి వారికి రుణం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి. కానీ బ్యాంకు రుణం కోసం టూటౌన్‌ పరిధిలోని ఓ ఆర్పీ మెప్మా కార్యాలయానికి 8 మంది సభ్యులను తీసుకువచ్చి పేపర్లపై సంతకం చేయాలని కోరగా ఇద్దరు సభ్యులు తక్కువగా వచ్చారని, ఆలస్యంగా వచ్చారనే కారణంతో ఆర్పీపై సదరు సీఓ పేపర్లు విసిరికొట్టినట్లు చర్చ జరుగుతోంది. దాంతో ఆమె విలపిస్తూ వెళ్లిపోయినట్లు తెలిసింది. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలో కూడా రికార్డు అయినట్లు ఆర్పీలు చెబుతున్నారు. ఇటీవల టూటౌన్‌ పరిధిలోనే ఓ ఆర్పీకి తెలియకుండా సీఓ ఒక సంఘానికి బ్యాంకు రుణం ఇప్పించి చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది. తన ప్రమేయం లేకుండా బ్యాంకు రుణం ఇప్పించడంతో సదరు ఆర్పీ మరో 20 మంది ఆర్పీలతో కలిసి విషయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లగా సీఓను మందలించినట్లు తెలిసింది. దాంతో సదరు సీఓ ఆ 20 మంది ఆర్పీలను టార్గెట్‌ చేసి బ్యాంకు రుణాల మంజూరు విషయంలో కొర్రీలు పెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement