
సీజనల్ వ్యాధులను అరికడతాం
వ్యాధులు వ్యాపించే సీజన్
వర్షాకాలంలో దోమలు, ఈగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాగునీరు కలుషితం అవుతుంది. ఈ కాలంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయి. దీని కారణంగా మలేరియా, డెంగీ, మెదడువాపు, పైలేరియా, చికున్గున్యా, డయేరియా, కలరా, టైపాయిడ్, స్వైన్ఫ్లూతోపాటు అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదముంది. వీటిని అధిగమించడానికి వైద్య ఆరోగ్య శాఖ అన్నిరకాల చర్యలు చేపట్టింది.
ఫ అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాం
ఫ వ్యక్తిగత, పరిసరాల శుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం
ఫ వైద్యసిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్
‘వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అన్ని రకాల మందులను సిద్ధంగా ఉంచాం. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’ అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తీసుకున్న చర్యలపై ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. –నల్లగొండ టౌన్
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
వర్షాకాలంలో ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. పరిసరాల్లో నీటి గుంతల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని వడబోసుకుని తాగాలి. వేడివేడి పదార్థాలు తినాలి. తాగునీటి ట్యాంకులో ఫ్లోరిన్ బిల్లలు వేసుకోవాలి. అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
మున్సిపల్, పంచాయతీ సిబ్బంది సహకారం
గ్రామాలు, పట్టణాల్లో డ్రెయినేజీలను శుభ్రం చేయడం మురుగు గుంతల్లో మట్టిని పోయించడానికి పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటాం. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయడంతోపాటు పారిశుద్ధ్య పనుల కోసం ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచించాం. పట్టణాల్లో దోమల నివారణకు మురుగు కాల్వల్లో పైరాత్రమ్ లిక్విడ్తోపాటు ఆబేగ్ టాబ్లెట్లను వేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.

సీజనల్ వ్యాధులను అరికడతాం