
రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి
నల్లగొండ : ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులకు రైతు భరోసా ఇస్తున్నారని, దీనిపై పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబరాలు నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు రుణ మాఫీ, సన్న బియ్యం అందిస్తూ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేశామన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక టీఆర్ఎస్, బీజేపీ నాయకులు పనికిరాని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రైతు ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నందుకు ముఖ్యమంతి, జిల్లా మంత్రులు, ఇన్చార్జి మంత్రి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బురి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
మిర్యాలగూడ : గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరగనుందని, దీనిపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామంలో ఎస్ఎన్డీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న సీపీఎం నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు సోమవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో సమస్యలు తిష్టవేశాయని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్నాయక్, శశిధర్రెడ్డి, రొండి శ్రీనివాస్, చౌగాని సీతారాములు, అయూబ్, గాదె పద్మ, సత్యనారాయణ పాల్గొన్నారు.
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు
నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి అన్నారు. నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం బీజేవైఎం నాయకులు విద్యా రంగ సమస్యలు, మౌలిక సదుపాయాలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో బాలికలకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకుండా విద్యార్థుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. ప్రభుత్వ విద్యా రంగ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం బీజేవైఎం కార్యకర్తలు పోరాడాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్స్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలి
నల్లగొండ టౌన్ : కేంద్రం తీసుకొచ్చిన పెన్షనర్స్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరణ చట్టం వల్ల పెన్షనర్స్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతు భరోసా సంబరాలు నిర్వహించాలి