అమ్రాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి.. గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర గణాంకాధికారి దయానంద్ సూచించారు. అమ్రాబాద్, పదర మండలాల్లో బుధవారం చేపట్టిన ఇళ్ల లెక్కింపు సర్వేను రాష్ట్ర అదనపు డైరెక్టర్ అర్థనారిస్వామి, ఎస్ఓ నర్సింహస్వామి, ఎంపీఎస్ఓ ఆంజనేయులుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం అమ్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల లెక్కింపు సర్వేలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ప్రతి ఇంటికెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు. జనగణన నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్లు వెంకటేశ్వర్రెడ్డి, సురేశ్బాబు, ఆర్ఐ కృష్ణ ఉన్నారు.


