
దివ్యాంగులపై చులకనభావం వద్దు
నాగర్కర్నూల్ క్రైం: దివ్యాంగులపై వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నాగర్కర్నూల్ మండలం తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. వైకల్యం కారణంగా చిన్నచూపు చూడరాదని.. వ్యక్తిగత స్వేచ్ఛ హరించరాదన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించడం, అనుమతి లేకుండా పరిశోధనలు చేయడం, ఆహారం ఇవ్వకపోవడం, లైంగికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు జరిమానా విధించబడుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి దివ్యాంగులను అకారణంగా విడదీయరాదన్నారు. దివ్యాంగులు టోల్ఫ్రీ నంబర్ 14416ను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రఘు పాల్గొన్నారు.