
మహిళలకు రక్షణ కరువు
బిజినేపల్లి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్నర్సింహ అన్నారు. సోమవారం బిజినేపల్లిలో నిర్వహించిన 18వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడం దారుణమన్నారు. చెంచు గిరిజనులను కూడా అటవీ ప్రాంతంలో లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువచేసే ఖనిజ సంపదను ఆదానీ, అంబానీలకు నిసిగ్గుగా కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని.. వీటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుభరోసా వంటి ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. మన్మోహన్సింగ్ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని సీపీఐ సాధించిందని గుర్తుచేశారు. అంతకుముందు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి.. సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆనంద్జీ, వార్ల వెంకటయ్య, ఈర్ల చంద్రమౌళి, టి.నర్సింహ, మారేడు శివశంకర్, కృష్ణాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జీఓ 51ని సవరించాలి
బిజినేపల్లి: గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసేందుకు జీఓ 51ని సవరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కారుకొండ తండా పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్థానం కల్పించి.. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు సాయి, మశన్న, శివశంకర్, కృష్ణయ్య, కొండయ్య పాల్గొన్నారు.
కల్వకుర్తి డీఎస్పీగా
వెంకట్రెడ్డి
కల్వకుర్తిటౌన్: కల్వకుర్తి డీఎస్పీగా వెంకట్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయగా.. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వెంకట్రెడ్డిని కల్వకుర్తి డీఎస్పీగా నియమించారు. డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంకట్రెడ్డికి డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
26న అప్రెంటిస్షిప్ మేళా
కందనూలు: మహబూబ్నగర్ ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 26న అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 తర్వాత ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్తో అప్రెంటిస్షిప్ మేళాకు హాజరు కావాలని సూచించారు.
నేడు మండలస్థాయి
క్రీడాకారుల ఎంపికలు
కందనూలు: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం మంగళవారం మండల స్థాయిలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే మండలస్థాయి ఎంపికలకు 8–9 ఏళ్ల వయసు ఉన్న బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్కార్డు, స్టడీ, జననం, కుల ధ్రువపత్రాలు, ఐదు ఫొటోలు తీసుకురావాలని సూచించారు.

మహిళలకు రక్షణ కరువు

మహిళలకు రక్షణ కరువు