
పెన్షనర్ల హక్కులను కాపాడుకుందాం
కందనూలు: పెన్షనర్ల హక్కులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పెన్షనర్ల సంఘం జిల్లా ఆధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షనర్ల పాలిట ఆశనిపాతంగా మారిన ఫైనాన్స్ బిల్లు–2025ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏ పెన్షన్ రూల్స్కు సంబంధం లేకుండా ప్రభుత్వ పెన్షనర్లను వేర్వేరు గ్రూపులుగా విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. వేతన సవరణ సంఘం సిఫారసులను పాత పెన్షనర్లకు కాకుండా.. కొత్తగా రిటైర్డ్ అయిన వారికి మాత్రమే వర్తించే విధంగా చేయడం సరికాదని అన్నారు. పెన్షనర్ల హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి వెంకటశెట్టి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు చెన్నయ్య, మండలశాఖ అధ్యక్షుడు బుసిరెడ్డి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.