
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నేడు రైతులతో
సీఎం ముఖాముఖి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలస్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. రైతువేదికల వద్దకు ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
నాగర్కర్నూల్ రూరల్: రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. వానాకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని.. నామమాత్రంగా రుణమాఫీ పథకం వర్తింపజేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వడంలోనూ విఫలమైందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, నాయకులు ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, గీత, దశ్యానాయక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.