
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
నాగర్కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి వస్తారని.. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్లో పెట్టవద్దన్నారు. కాగా, ప్రజావాణికి 72 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లి గ్రామ పరిధిలో రూ. 21కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 3కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం, రూ. 2.85కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునికీకరణ పనుల్లో పురోగతి ఉండాలన్నారు. గ్రామంలో 515 ఇళ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 407 ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, పీఆర్ ఈఈ విజయ్ ఉన్నారు.