
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అచ్చంపేట రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి సిబ్బంది గతేడాది ఎక్కువగా డెంగీ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. దోమకాటు వ్యాధులైన డెంగీ, మలేరియా, చికెన్ గున్యా రాకుండా ప్రతి శుక్రవారం పొడి దినం (డ్రై డే) పాటించాలన్నారు. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు ఇనుప జాలీలను బిగించుకోవాలని, దోమతెరలు వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి ఆవరణ, పరిసరాలల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు తమ ఇంటి ఆవరణలో లేకుండా చూసుకునే విధంగా ప్రజలకు సూచించాలన్నారు. అన్ని పీహెచ్సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని, అనుమానం ఉన్నవారి రక్త నమూనాలను టీ–డయాగ్నోస్టిక్ హబ్కు ప్రతినిత్యం పంపాలన్నారు. గాలి ద్వారా వ్యాపించే స్వైన్ఫ్లూ, కోవిడ్–19 నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, ప్రోగ్రాం అధికారి రాజశేఖర్, డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.