
‘ముందస్తు’గా మేస్తున్నారు..!
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు ముందస్తు ప్రణాళికల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని అధికారులు తమ బినామీల పేరుతో పనులు చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ పనులన్నీ కేవలం పేపర్ల మీదనే జరగడం మరో విశేషం. ఇలాంటి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో సహకరించని ఉద్యోగులను బెదిరించి మరీ రికార్డులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో ముందస్తు ప్రణాళికలో భాగంగా సుమారు రూ.20 లక్షల వరకు పేపర్ల పైనే బిల్లుల చెల్లింపులు జరిగాయని ప్రచారం జరుగుతోంది.
బాక్స్, నామినేషన్ పద్ధతిలో..
మున్సిపాలిటీల్లో అత్యవసర పనులు చేసేందుకు ఎక్కువగా బాక్స్, నామినేషన్ పద్ధతిలో టెండర్లు వేస్తుంటారు. ఇలా చేసే పనులకు సంబంధించి పూర్తి వ్యవహారం అంతా ఇంజినీరింగ్ శాఖ అధికారి అజమాయిషీలో ఉంటుంది. దీంతో ఇంజినీరింగ్, అకౌంట్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే వారికి టెండర్లు దక్కుతుంటాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో గతంలో పాలకవర్గం ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి పనులు చేసినట్లుగా పేపర్లలో చూయించి, అకౌంట్ సెక్షన్ అధికారి చేతులు తడిపి బిల్లులు చేయించుకున్నట్లు కాంట్రాక్టర్లు చెప్పుకోవడం విశేషం.
అవినీతిలో అందెవేసిన చెయ్యి..
మున్సిపాలిటీల్లో అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉండేవి ఇతర అంశాల్లో చేపట్టే పనులు. పాలకవర్గం మీటింగ్లో పలు ఇతర అంశాలను ఎజెండాలో చేర్చి.. అధికారులకు, పాలకవర్గాలకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని అమలు చేస్తారు. అలాంటి వాటిలో ‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్లుగా అధికారులు, పాలకవర్గం సభ్యులు వాటాలు పంచుకుంటారు. ఇక్కడ లోపాలు అందరికీ తెలియడంతో ఎవరిని ఎవరూ ప్రశ్నించకుండా తేలు కుట్టిన దొంగల్లా పనులు చేసుకుంటున్నారు.
పేపరుపై చేసిన పనులకు చెల్లింపులు
సహకరించని ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్న వైనం
మున్సిపల్ అధికారుల చేతివాటం