
రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నాగర్కర్నూల్: రైతులకు అవసరమైన ఎరువును సమృద్ధిగా సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యదర్శి కె రామకష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్పాం పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాలపై సీఎస్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా 41 లక్షల మొక్కలు నాటేందకు ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1,200 మంది రైతులను గుర్తించి 3,500 ఎకరాల్లో ఆయిల్పాం పంట సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బదావత్ సంతోష్