
జూరాలకు వరదొచ్చింది
గద్వాల/ధరూరు/ఆత్మకూర్: కృష్ణా బేసిన్లో ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు కేవలం 3,624 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా వరద పెరిగింది. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా.. భీమా ప్రాజెక్టు నుంచి దాదాపు లక్ష క్యూసెక్కులు విడుదల చేశారని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ఈ సీజన్లో తొలిసారి జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో ప్రాజెక్టుకు 99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12 గేట్లను ఎత్తి 83,616 వేల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. చివరిసారిగా 2007లో మే నెలలోనే జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చిందని, మళ్లీ 18 ఏళ్ల తర్వాత ఈ నెలలో వరద రావడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. 40 ఏళ్ల ప్రాజెక్టు చరిత్రలో మే నెలలో వరద రావడం ఇది ఐదోసారి మాత్రమే. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలశయంలో 8.571 టీఎంసీల నీరు ఉంది.
● జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమై లిఫ్టు–1 గుడ్డెందొడ్డి వద్ద రెండు పంపులను ప్రారంభించి 1,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి.. గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లను నింపుతున్నారు. జూలై మూడో వారంలో ప్రారంభం కావాల్సిన వరద ముందు రావడంతో.. అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుదుత్పత్తి ప్రారంభం
కాగా.. గురువారం అర్ధరాత్రి ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఎస్ఈ శ్రీధర్ బృందం ప్రత్యేక పూజలను నిర్వహించి విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. అనంతరం జన్కో ఉద్యోగులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఎగువలో ఐదు యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టారు. గతేడాది జూలై 17న రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా.. 49 రోజుల ముందే ప్రారంభం కావడంతో 610 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
పూర్తిస్థాయి నీటి మట్టంతో కళకళాడుతున్న
జూరాల ప్రాజెక్టు
●
18 ఏళ్ల తర్వాత మే నెలలోనే ప్రవాహం
99 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో..
12 గేట్లు ఎత్తివేత
అర్ధరాత్రి 11 యూనిట్లలో
విద్యుదుత్పత్తి ప్రారంభం

జూరాలకు వరదొచ్చింది