
భూ సేకరణ వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ప్రాజెక్టుల భూ సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్షిస్తున్నారని, అందుకు అనుగుణంగానే రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు నిబద్ధతతో పనిచేసి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యంత మొదటి ప్రాధాన్యతగా భూసేకరణ పనులు జూన్ 6 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను రెండ్రోజుల్లోనే పూర్తి చేయాలని సర్వే ల్యాండ్ అధికారికి సూచించారు. మార్కండేయ ఎత్తిపోతల పథకం కింద గంగారం, శాయిన్పల్లి గ్రామంలో వెంటనే సర్వే పూర్తి చేయాలన్నారు. కేఎల్ఐలో భాగంగా ప్యాకేజీ–28, 29, 30లో తాడూరు, తెలకపల్లి, కల్వకుర్తి, వంగూరు, వెల్దండ, అచ్చంపేట మండలాల్లోని ఆయా గ్రామాల వారీగా చివరి దశలో ఉన్న సేకరించాల్సిన భూముల వివరాలు ప్రస్తుత స్థాయిలను అవసరమైన చర్యలపై సమీక్షించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అరుణ, నీటి పారుదల శాఖ అధికారులు సత్యనారాయణరెడ్డి, పార్థసారథి, మురళి, జిల్లా సర్వే ల్యాండ్ అధికారి నాగేందర్, ఆర్డీఓలు మాధవి, సురేష్, భూ సేకరణ విభాగం కలెక్టరేట్ సూపరింటెండెంట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో భూ భారతి చట్టంపై రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, వచ్చే భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఏ గ్రామంలో ఎప్పుడు ఏ సమయానికి ఎక్కడ నిర్వహిస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ముందస్తుగా గ్రామాల వారిగా టాంటాం వేయించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చే దరఖాస్తులు అన్నింటినీ ఆగస్టు 15లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
6 నుంచి బడిబాట కార్యక్రమం
జిల్లాలో వచ్చే నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించి.. బడిబయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో డీఈఓ రమేష్కుమార్, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, సీడీపీలతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు, స్వయం సహాయక బృందాలు కలిసి ఇంటింటికీ వెళ్లి విద్య ప్రాముఖ్యతను వివరించాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడం, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.