
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు : ఎమ్మెల్సీ గోరటి
కల్వకుర్తి రూరల్: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. శనివారం సాయంత్రం మండలంలోని తోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు తమ మేధస్సుతో ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని.. తాము పనిచేసినన్ని రోజులు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయుడు విజయభాస్కర్రెడ్డిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విష్ణుమూర్తి, శంకర్నాయక్, నరేష్గౌడ్, రాజేందర్, సింగయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు చేయాలి
బిజినేపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డా. ఎం.లక్ష్మణ్నాయక్ అన్నారు. శనివారం మండలంలోని పాలెం పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గర్భిణికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు జరిగేలా చూడాలని, అందుతున్న వైద్యసేవలపై అవగాహన కల్పించి మూత్ర, రక్త పరీక్షలు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉచితంగా నిర్వహించి రిపోర్టులు అందజేయాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణులు నిరంతరం అందుబాటులో ఉంటారని, 102 అంబులెన్స్ సదుపాయం ఉందన్నారు. ఆయన వెంట పీహెచ్సీ వైద్యాధికారి డా. ప్రియాంక, విస్తరణ అధికారి బాదం రాజేష్, కుమార్ తదితరులు ఉన్నారు.
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
కందనూలు: జిల్లాకేంద్రంలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్శాఖ ఏఈ మాన్యానాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఉయ్యాలవాడ నుంచి కూరగాయల మార్కెట్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా తీగల మరమ్మతులు, అదేవిధంగా కలెక్టరేట్ సమీపంలోని సబ్స్టేషన్లో మరమ్మతులతో కలెక్టరేట్, దేశిటిక్యాల, మంతటి చౌరస్తా, నల్లవెల్లి తదితర ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడుతుందని.. విద్యుత్ వినియోగదారులు గుర్తించి సహకరించాలని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు : ఎమ్మెల్సీ గోరటి