న్యూస్రీల్
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం అద్భుత కట్టడమని సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ రాకేశ్ గోయల్ కొనియాడారు. మండలంలోని పాలంపేట గ్రామంలో గల రామప్ప దేవాలయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమా శంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేష వస్త్రాలను బహుకరించారు. ఆలయ చరిత్ర శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ రమణారెడ్డి, సూపరింటెండెంట్ సమ్మయ్య, జీఎస్టీ అధికారులు, సిబ్బంది, రామప్ప హరితహోటల్ మేనేజర్ శ్రవణ్, టూరిస్ట్ పోలీసులు, టూరిజం, దేవాదాయ, పురావాస్తు శాఖల అధికారులు పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. పూజారులు పవన్కుమార్ ఆచార్యులు, రాజీవ్ శర్మ, ఈశ్వర్చంద్రామానుజం భక్తుల గోత్రనామాలతో స్వామివారికి అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
లక్నవరంలో సందడి
గోవిందరావుపేట: జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ముఖ్యంగా చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు సరస్సు అందాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదకరంగా గడిపారు. లక్నవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వేలాడే వంతెనపై నడుస్తూ సందర్శకులు ప్రకృతి సోయగాలను తిలకించారు. సెల్పీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులు, యువత ఉత్సాహంగా గడిపారు. సరస్సు చుట్టూ విస్తరించిన పచ్చని వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సరస్సులో బోటింగ్ నిర్వహించేందుకు అవసరమైన స్థాయిలో నీటిమట్టం లేకపోవడంతో అధికారులు బోటింగ్ను నిలిపివేశారు. దీంతో బోటింగ్ కోసం ప్రత్యేకంగా వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరిగారు.


