క్రీడలతో మానసికోల్లాసం
గోవిందరావుపేట: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని వివిధ బెటాలియన్లకు చెందిన కమాండెంట్లు జమీల్ భాషా, సత్యనారాయణ, వెంకట్రాములు, పెద్దబాబు, రిటైర్డ్ డీఎస్పీ కుమారస్వామి అన్నారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో 5వ బెటాలియన్ ప్రాంగణంలో వార్షిక క్రీడోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. అనంతరం 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సిబ్బందికి ప్రతీ ఏడాది క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామపాలన అధికారుల జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: గ్రామపాలన అధికారుల జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో గ్రామపాలన అధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా సబాక సర్వేశ్వరావు, ఉపాధ్యక్షుడిగా బల్గూరి సూరయ్య, ప్రధాన కార్యదర్శిగా అర్లె రాజేందర్, కోశాధికారి తొర్రం శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శగా బొప్ప సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా గంప నర్సయ్య, కార్యవర్గ సభ్యులుగా కాసర్ల రాజయ్య, బొచ్చు కృష్ణవేణి, సమ్మక్క, రుక్మిణిని ఎన్నుకున్నారు.
గీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి
ములుగు రూరల్: కల్లుగీత కార్మికులు హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు పులి నర్సయ్యగౌడ్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో ఇటీవల జీపీ ఎన్నికల్లో సర్పంచ్లుగా విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్ అభ్యర్థులు కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిపల్లి చైతన్య, సంఘం అధ్యక్షుడు గుండెబోయిన రవి, బుర్ర శ్రీనివాస్, తాడూరి సంపత్, బాబు, రాజశేఖర్, సోమయ్య, రజిత, రాజు, రమేష్, సత్యం, మల్లేశ్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: మేరా యువభారత్ మహాన్ వరంగల్ ఆధ్వర్యంలో యువజన సంఘాల నుంచి క్రీడా సామగ్రి పొందేందుకు గాను దరఖాస్తులు చేసుకోవాలని మేర యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మై భారత్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన ఉమ్మడి జిల్లాలోని యువజన సంఘాలు, మహిళ మండలీల నుంచి దరఖాస్తులు ఈ నెల 31వ తేదీ లోపు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ 08702958776లో సంప్రదించాలని సూచించారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు, అర్చనలు జరిపించారు.
క్రీడలతో మానసికోల్లాసం


