
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత ఎదుగుదలకు గొడ్డలిపెట్టు లాంటిదని తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాల సమాచారం టోల్ ఫ్రీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఇన్చార్జ్ డిడబ్ల్యూఓ తుల రవి, వైద్యారోగ్యశాఖ, యాంటి నార్కోటిక్ విభాగం అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వైద్యకళాశాలను కలెక్టర్ దివాకర సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత విద్యాసంవత్సరంలో అందుతున్న వసతులు, వచ్చే విద్యా సంవత్సరంలో కావాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కళాశాల ప్రహరీకి ఔషధ గిడ్డంగులను, సీసీ రోడ్డు కొరకు స్థలాన్ని పరిశీలించారు. ఎన్ఎంసీ నుంచి ఎంబీబీఎస్ వరకు రెండేళ్లు కావాల్సిన అనుమతి కోసం, సదుపాయాలపై టీజీఎంఐడీసీ ఇంజనీర్లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ లాల్, డీసీహెచ్ఎస్ జగదీశ్వర్, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, నరేందర్ రెడ్డి, డీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి