
న్యాయం చేయాలని వేడుకోలు..
మంగపేట: భర్త అనారోగ్యంతో మరణించగా ఇద్దరు కూతుళ్లతో ఉన్న తనకు అండగా నిలవాల్సిన బంధువులు, ఓ బీఆర్ఎస్ నాయకుడు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ మహిళ తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.. న్యాయం కోసం అధికారుల ఆశ్రయిస్తే తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట విలేకర్లకు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని కమలాపురం గ్రామానికి చెందిన కోరుకొప్పుల సత్యం, రాణి దంపతులు నివాసం ఉంటున్నారు.. ఈ క్రమంలో భర్త అనారోగ్యానికి గురై మృతువాత పడ్డాడు.. ఈ క్రమంలో ఉమ్మడి కుటుంబంలోని తన వాటాకు రావాల్సిన భూమిని తాను ఇంటివద్ద లేని సమయంలో చిన్న పిల్లలైన కూతుళ్లను బెదిరించి సంతకాలు పెట్టించి అమ్మారని వాపోయింది. అంతేకాకుండా తన భర్త వైద్యం కోసం దాతలు అందించిన రూ.10 లక్షల్లో నుంచి రూ.6 లక్షల నగదును వారే తీసుకున్నారని ఆరోపించింది. న్యాయం కోసం తాను ఎస్పీ, సీఐ, ఎస్సై, తహసీల్దార్ను ఆశ్రయించానని వివరించింది. స్పందించిన అధికారులు తమ భూమిని తమకు ఇవ్వాలని సూచించడంతో తమపై ఫిర్యాదు చేస్తారా అనే కోపంతో అంతుచూస్తామంటూ కమలాపురంకు చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడి అండతో తమపై దాడి చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయింది. ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటుంది.