
శరవేగంగా గ్యారేజ్
రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపో పనులు ప్రారంభం
ఏటూరునాగారం: ఏటూరునాగారంలో ఆర్టీసీ బస్డిపో నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆర్టీసీ బస్సులను మరమ్మతులు చేసే గ్యారేజ్ పనులును అధికారులు షురూ చేశారు. రూ.7 కోట్లతో ఆర్టీసీ డిపోను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఈనెల 12వ తేదీన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపోతో పాటు డీఎం కార్యాలయం, బస్సు నిలుపు స్థలం, గ్యారేజ్, ఇతర సిబ్బంది కార్యాలయాలతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలను నిర్మించేందుకు తగిన ఇంజనీరింగ్ ప్లాన్ను రూపొందించారు. ఈ మేరకు గ్యారేజ్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించి శరవేగంగా పూర్తి అయ్యేలా చూస్తున్నారు.
పలు రాష్ట్రాలకు రవాణా
ఏటూరునాగారం బస్డిపో నిర్మాణం పూర్తి అయితే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు దూర ప్రాంతాలకు ఇక్కడ డిపో బస్సులను వినియోగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కావాల్సిన నిర్మాణ పనులను ముందుగా చేపట్టారు. గతంలో డిపో స్థలంలో ఉన్న పాత భవనాలను కూల్చివేసి అక్కడే నూతన భవనాన్ని నిర్మించడానికి పూనుకున్నారు.
కొనసాగుతున్న పిల్లర్ల పనులు
ప్రస్తుతం బస్సులను మరమ్మతులు చేసేందుకు గ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ల పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఏటూరునాగారం ఏజెన్సీలో ప్రజలు గత 30 సంవత్సరాలుగా బస్సు డిపో కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి మరో మణిహారంగా డిపో ఏర్పాటు మారనుంది.
పనులు నడుస్తున్నాయి..
ఆర్టీసీ డిపో ఏర్పాటు పనులు సాగుతున్నాయి. సుమారుగా తొలుత 30 బస్సులతో ఏర్పాటు చేయనున్నాం. అందుకు కావాల్సిన చర్యలు, ఏర్పాట్లను చేస్తున్నారు. ముందుగా గ్యారేజ్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత బస్సుల మరమ్మతులతో పాటు నిలుపు స్థలం, డిపో మేనేజర్ ఇలా అనేక భవనాలను నిర్మించనున్నారు.
– విజయ్భాను, ఆర్టీసీ ఆర్ఎం
●
ఇంజనీరింగ్ ప్లాన్తో
మిగతా కార్యాలయాల నిర్మాణం
తొలుత 30 బస్సులతో డిపో ఏర్పాటు

శరవేగంగా గ్యారేజ్

శరవేగంగా గ్యారేజ్