
సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి
ములుగు రూరల్: సామాజిక న్యాయం కోసం ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సామాజిక న్యాయ వేదిక జిల్లా అధ్యక్షుడు పోరిక శ్యామల్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల జాబితాలో రెడ్డి కులానికి చెందిన వారికే ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. కుమ్మరి, చాకలి, లంబాడ, వడ్డెర కులాలకు మంత్రి పదవులు దక్కలేదన్నారు. మిగతా సామాజిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయ వేదిక సభ్యులు పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్
బాధ్యులను శిక్షించాలి
హన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు.
జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాల ఎంపిక
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 25వ తేదీన క్రీడా పాఠశాలకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాము ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలస్థాయిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యే విద్యార్థులు పుట్టినతేది ధృవీకరణ పత్రం, కుల, స్టడీ సర్టిఫికెట్, పాస్ ఫొటోలు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు.
హామీలను నెరవేర్చాలి
భూపాలపల్లి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.6లక్షల నిధులు కేటాయించాలని దళితులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి నాయకులు పొనగంటి లావణ్య అధ్యక్షతన మూడవ జిల్లా మహాసభకు రాజారత్నం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని కోరారు. అంబేడ్కర్ యోజన పథకాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాసపల్లి భద్రయ్య, సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, పసరగొండ మహేందర్, బౌతు కమలాకర్, దొంతుల రవీందర్, రాజమౌళి, గుర్రం సంపత్, రమేష్ రాజేష్, చిట్యాల పద్మ, బానమ్మ పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి

సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలి