
హేమాచల క్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు గుట్టపై నెలకొన్న హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ గా తరలివచ్చారు. రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజ మండ్రి, విశాఖ పట్టణం తదితర సుదూర ప్రాంతా ల నుంచి కార్లు, ఆటోలు, డీసీఎం, ప్రైవేట్ వాహనాల్లో ఉదయాన్నే భక్తులు గుట్టపైకి చేరకున్నారు.
చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు
ఆలయ సమీపంలో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని పూలు పండ్లు, పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆలయ అర్చకులు స్వామివారికి తిలతైలాభిషేక పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు.
నాభిచందన ప్రసాదం
సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా మారింది.
లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు
భారీగా తరలివచ్చిన భక్తులు

హేమాచల క్షేత్రంలో సండే సందడి