కాంగ్రెస్‌ పాలనలో పేదలకు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో పేదలకు అన్యాయం

Jun 22 2025 3:22 AM | Updated on Jun 22 2025 3:22 AM

కాంగ్రెస్‌ పాలనలో పేదలకు అన్యాయం

కాంగ్రెస్‌ పాలనలో పేదలకు అన్యాయం

ఎస్‌ఎస్‌తాడ్వాయి: కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని కాటాపూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో కాటాపూర్‌లో 108 మంది భూమిలేని నిరుపేద కుటుంబాలకు భూమి కేటాయించినట్లు తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక రెవెన్యూ అధికారులను, కలెక్టర్‌ను బాధితులు కలిసి విన్నవించుకున్నా పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మేడారంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇసుక దందాకు అడ్డుపడిన ఇద్దరు తహసీల్దార్లను అధికార బలంతో బదిలీ చేసి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మేడారం అమ్మవార్లను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తుంటే ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ను నియమించడం ఏమిటని ప్రశ్నించారు. అడవినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల గుడిసెలను ఫారెస్ట్‌ అధికారులు తొలగించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రామ సహాయం శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్‌ రావు, నుశెట్టి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement