
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇళ్ల పురోగతిని ఆన్లైన్లో నమోదు చేయాలి
కలెక్టర్ దివాకర
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ దివాకర అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడతలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను గ్రౌండింగ్ చేయాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు అందిస్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు టోకెన్ల పద్ధతి ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాతో టోకెన్ల జారీ విధానంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను మ్యాపింగ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ అధికారులు, ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంపత్రావు, ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఏపీఎంలు, సీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారిగా వాసంతి
ములుగు రూరల్: జిల్లా విద్యాశాఖ అధికారిగా వాసంతికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమె ములుగు డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో ములుగు జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన వాసంతికి తిరిగి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.

వాతావరణం