
పోలీసుల అత్యుత్సాహం
కన్నాయిగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి పథకం అమలులో భాగంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులో పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తించారు. ప్రజలు, విలేకర్లపై దురుసుగా ప్రవర్తించారు. వివరాల్లోకి వేళ్తే.. మండల పరిధిలోని బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో బుధవారం భూ భారతిపై రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామంలోని భూసమస్యలు ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు ఎక్కువగా రావడంతో పేరు పిలిచిన వారు రావాలని చెప్పడంతో రైతులు కొంతదూరంలో కూర్చున్నారు.
దరఖాస్తులు పోలీసుల చేతుల్లో..
ఈ క్రమంలో రెవెన్యూ అఽధికారులకు ఇచ్చిన దరఖాస్తులను కానిస్టేబుళ్లు చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అధికారుల వద్ద ఉండాల్సిన దరఖాస్తులు పోలీసులు తీసుకోవడం ఏమిటని ప్రజలు మండి పడ్డారు. భూముల సమస్యలు పోలీసులు పరిష్కరిస్తారా.. లేక అధికారులు పరిష్కరిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు సదస్సు విజయవంతానికి కృషి చేయాలి కాని అత్యుత్సాహంగా ప్రవర్తించడంపై వాపోయారు.
రెవెన్యూ సదస్సులో ప్రజలు,
విలేకర్ౖలపై దురుసు ప్రవర్తన
వివరాల సేకరణకు వెళ్లిన విలేకర్లకు..
ఇదే క్రమంలో దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న కొంతమంది విలేకర్ల పట్ల ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి దురుసుగా ప్రవర్తించారు. మీరు ఎవరు.. బయటికి వెళ్లండి అంటూ బూతులు తిడుతూ బయటికి నెట్టివేశాడు. బయట నిల్చోని జరిగిన సంఘటనపై చర్చించుకుంటే మరో కానిస్టేబుల్తో వచ్చి ఓ విలేకరి చేతులో ఉన్న ఫోన్ లాక్కొని మరో కానిస్టేబుల్కు ఇచ్చి మరోసారి తిట్టసాగాడు. అంతలోనే చుట్టుపక్కల ఉన్న జనం ఎదురుతిరిగారు. అనంతరం 15నిమిషాల తర్వాత ఫోన్ అప్పగించారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.