
ఆదివాసీలకు అండగా ఉంటాం..
ఏటూరునాగారం: అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలను గుడిసెలు వదిలిపొమ్మనడం దారుణమని, ఆదివాసులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని రొయ్యూరు సమీపంలోని ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను ఆమె మంగళవారం పరిశీలించారు. అటవీశాఖ అధికారులు గుడిసెలు కూల్చివేసేందుకు చేసిన ప్రయత్నాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలో ఉండగానే అటవీశాఖ అధికారులు గుడిసెలను జేసీబీలతో కూల్చివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆదివాసీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఇచ్చిన హామీలు మర్చిపోయారా అంటూ మంత్రి సీతక్కను ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు ఇలాంటి చర్యలు పునరావృతం చేస్తే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్, నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఖాజాపాషా, దున్నపునేని కిరణ్, కాళ్ల రామకృష్ణ, కుమ్మరి చంద్రబాబు, చిన్ని కృష్ణ, చంద్రమౌళి, రాంబాబు, ఆదివాసీలు, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి