
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
ములుగు రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గోపాల్రావు సిబ్బందికి సూచించారు. ఈ మేరకు మంగళవారం కీటక జనిత వ్యాధుల నియంత్రణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మలేరియా, డెంగీ వ్యాధులు ఎక్కువగా నమోదైన గ్రామాలలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. సర్వే, యాంటీ లార్వా స్ప్రే, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, నీటి నిల్వలపై మూతలు పెట్టడం, నీటి గుంటలలో ఆయిల్ బాల్స్ వేయడం లాంటి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి గ్రామాల్లో ఆంటీ లార్వా స్ప్రే చేయించాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా పరీక్షలు నిర్వహించేందుకు మైక్రోస్కోప్ పనితీరును పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ చంద్రకాంత్, శ్రీకాంత్, డెమో సంపత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు