
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు
గోవిందరావుపేట: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. మండల పరిధిలోని పస్రాలో పార్టీ మండల అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముడుపులు అప్పజెప్పిన వారికి ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇస్తున్న ఇళ్లను అర్హులందరికీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తామే పూర్తిగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్వరూపనాయక్, రవీందర్ రెడ్డి, కృష్ణాకర్, వెంకట్, వెంకన్న, సత్యనారాయణ, సాంబశివరెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇళ్లు
వెంకటాపురం(ఎం): ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం కింద సగం నిధులు మంజూరు చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పేర్కొన్నారు. మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు పైడాకుల మల్లేష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇంటింటికి తీసుకవెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించి పల్లెపల్లెన కమలం జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూక్య జవహర్లాల్, దండిగ వెంకన్న, కారుపోతుల యాదగిరి, అల్లె శోభన్, వైద్గుల తిరుపతిరెడ్డి, చర్లపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం