
ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలి
వాజేడు : మండలంలోని ధర్మవరం పట్టా ల్యాండ్ ఇసుక క్వారీలో అక్రమ తవ్వకాలను ఆపాలని ఓడబలిజ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్, అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్రావు అన్నారు. శుక్రవారం వారు ఇసుక క్వారీని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టప్రకారం రెండు మీటర్ల మేర ఇసుక తవ్వకాలను చేపట్టాల్సిన కాంట్రాక్టర్ 6 నుంచి ఏడు మీటర్ల వరకు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. రానున్న గోదావరి వరదల కారణంగా ఒడ్డును ఆనుకుని ఉన్న పొలాలు, పంటలు మొత్తం కోతకు గురై రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వుతున్నా.. అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తిన’ చందంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బొల్లె ఆదినారాయణ, ఓడబలిజ సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఓడబలిజ సేవాసంఘం
రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్