
తెరుచుకున్న ‘మూత’బడి
వాజేడు: విద్యార్ధులు లేరనే కారణం చూపుతూ నాలుగు సంవత్సరాల క్రితం మూసేసిన ప్రభుత్వ పాఠశాలను అధికారులు గురువారం తెరిపించారు. మండల పరిధిలోని పాయబాటలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా నుంచి వచ్చిన సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు అర్షం రాజు, గుళ్లపల్లి సాంబయ్య, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ జిల్లా మేనేజర్ అప్పని జయదేవ్లతో పాటు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామస్తులతో పాఠశాల ప్రాధాన్యత గురించి మాట్లాడి గ్రామంలోని ఇద్దరు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. ఇప్పటి నుంచి పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం మూసేసిన పాఠశాల తెరవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.