
ఆయిల్పామ్ సాగుపై దృష్టి పెట్టాలి
ఏటూరునాగారం: జిల్లాలోని రైతులు ఆయిల్పామ్ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు అన్నారు. మండలంలోని శంకరాజుపల్లి రైతు వేదిక కార్యాలయంలో ఉద్యాన పంటలపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. ఈ వర్షాకాలంలో ఉద్యాన పంటల సాగు అంతర, మిశ్రమ పంటల సాగు ఆవశ్యకత, ఆయిల్ పామ్ తోటలకు రాయితీ వివరాలు, పోడు పట్టాలు కలిగిన ఎస్టీ రైతులకు ఇందిర సౌర పథకం, గిరివికాసం పథకం రాయితీలపై వివరించారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి రూ.50,918ల వరకు రాయితీ ప్రభుత్వం అందిస్తోందన్నారు. డ్రిప్పై రాయితీ ఎస్టీ, ఎస్సీ రైతులకు 100శాతం, చిన్న, సన్నకారు రైతులకు 90శాతం, ఇతర రైతులకు 80శాతం రాయితీ ఉంటుందని వివరించారు. సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి పథకంలో మామిడి, అరటి, బొప్పాయి, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు 50 శాతం రాయితీ, పందిళ్లపై తీగజాతి కూరగాయలను సాగు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం డివిజన్ ఉద్యాన అధికారి కోపిరి లావణ్య, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధి దుగ్గి అఖిల్, ఫినోలెక్స్ డిప్ కంపెనీ ప్రతినిధి రోహిత్, రైతులు విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, జాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యానశాఖ జిల్లా అధికారి సంజీవరావు