
ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి
ములుగు రూరల్: ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలు నవంబర్ నెల నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క, సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ టీఎస్ దివాకర, అడిషనల్ కలెక్టర్ సంపత్రావు, అధికారులు వీసీలో పాల్గొన్నారు. పెట్రోల్ పంపు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భూములను పది రోజుల్లో గుర్తించాలన్నారు. జూన్ 12వ తేదీన పాఠశాల పునఃప్రారంభం పండుగలా నిర్వహించాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు అందించాలన్నారు. రాష్ట్రంలో మహిళలకు కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దె బస్సులు, పెట్రోల్ పంపులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల ఏకరూ ప దుస్తుల కుట్టు పనులు చివరి దశకు చేరుకున్నాయని, పెండింగ్లో ఉన్న కుట్టు పనులను త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలు నవంబర్ నాటికి పూర్తి చేసేందు కు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెట్రోల్ పంప్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటునకు స్థలం గుర్తించాలి
వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క