మెరుగైన వైద్యసేవలు అందించాలి

డయాలసిస్‌ రోగులతో మాట్లాడుతున్న పీఓ  - Sakshi

ఏటూరునాగారం: సామాజిక ఆస్పత్రికి వస్తున్న గర్భిణులు, ఇతర రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ అంకిత్‌ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని ఆయన జిల్లా వైద్యాధికారి అప్పయ్యతో కలిసి ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం కొత్తగా నిర్మించిన మాతా, శిశు ఆరోగ్య భవనంలో డయాలసిస్‌ సెంటర్‌ను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మిషనరీలు, మెడిసిన్‌, ఇతర పరికరాలు, సర్జికల్స్‌ నిల్వ చేసుకోవాలన్నారు. భవనంలో కావాల్సిన పరికరాలు లేవని, వాటి వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సురేష్‌కుమార్‌ పీఓకు వివరించారు. ములుగు వెలుగు యాప్‌లో వైద్యులు, సిబ్బంది హాజరు వేయాలని, వేయకపోతే చర్యలుంటాయన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పనిచేస్తున్న వైద్యులతో పీఓ సమావేశమయ్యారు. స్పెషలిస్ట్‌ వైద్యులు సమయానికి క్రమం తప్పకుండా విధులకు హాజరు కావాలన్నారు. స్పెషలిస్ట్‌ డాక్టర్లు సాధారణ కాన్పులు అయ్యే విధంగా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని గిరిజన బాలికల జూనియర్‌ కళాశాలను పీఓ తనిఖీ చేశారు. లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల్లో ఉత్తీర్ణశాతం రావాలన్నారు. వార్డెన్లు రాత్రి సమయాల్లో పర్యవేక్షణ చేయాలన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో క్రీడా పోటీలు ఉన్నాయని, వేసవిలో బ్రిడ్జ్‌ కోర్సు క్యాంపులకు ప్లాన్‌ చేస్తున్నామని పీఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్‌చందర్‌, దిలీప్‌, పుద్విరాజ్‌, అనిల్‌ పాల్గొన్నారు.

రక్తహీనత నిర్మూలనకు న్యూట్రిషన్‌ కిట్లు

గర్బిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత నిర్మూలన కోసమే ఐటీడీఏ ద్వారా ప్రత్యేక న్యూట్రిషన్‌ కిట్లు అందిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ అంకిత్‌ తెలిపారు. మండల కేంద్రంలోని నేతాజీనగర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ పక్షంలో భాగంగా న్యూట్రిషన్‌ కిట్లను బాలింతలకు పీఓ అందజేశారు. అనంతరం పీఓ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలన్నారు. ఈ ఏడాది మిల్లట్స్‌ సంవత్సరంగా ప్రకటించినట్లు తెలిపారు. ఐటీడీఏ ద్వారా బాలింతలకు ఇప్పపువ్వు లడ్డు, పల్లి, నువ్వులపట్టి, జోహర్‌ స్వీట్‌ మిల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, పీహెచ్‌ఓ రమణ, సూపర్‌వైజర్‌ మనోరమ, వసంత, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ అంకిత్‌

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top