పాటలు పాడే సింగర్స్ మహా అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు. కొన్నిసార్లు మాత్రం ఊహంచని సర్ప్రైజ్ ఇస్తుంటారు. లేటెస్ట్గా ఓ తెలుగు గాయని.. ఐటమ్ సాంగ్లో గ్లామరస్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆమెనే జోనితా గాంధీ. తెలుగు ప్రేక్షకుల్లో కొందరికి ఈమె గురించి తెలుసు. అయితే ఈమె నుంచి అదిరిపోయే డ్యాన్స్ చూసి మాత్రం ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈమె ఎవరు? డీటైల్స్ ఏంటి?
(ఇదీ చదవండి: ఓటీటీలో 'మట్కా కింగ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
జోనితా గాంధీ ఢిల్లీలో పుట్టింది. ఈమెకు 9 నెలల వయసున్నప్పుడే కుటుంబమంతా కెనడా వెళ్లిపోయింది. తర్వాత అక్కడే సెటిలైపోయారు. దీంతో చదువంతా అక్కడే పూర్తి చేసింది. ఏడేళ్లు ఉన్నప్పుడే పాటలు పాడటం లాంటివి చేసింది. తర్వాత కొన్నేళ్లకు తన పాడిన పాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేది. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండేసరికి పాడటాన్ని కెరీర్గా ఎంచుకోవాలని నిర్ణయించుకుంది. కొన్నాళ్లకు భారత్కి తిరిగొచ్చింది.
జోనితాలోని ప్రతిభని గుర్తించిన బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్.. షారూఖ్ ఖాన్ 'చెన్నై ఎక్స్ప్రెస్' టైటిల్ సాంగ్ పాడే అవకాశం కల్పించారు. తొలి పాటే ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి ప్రసిద్ధ గాయకుడితో కలిసి పాడేసరికి జోనితాకు ఫేమ్ వచ్చింది. తర్వాత ఏఆర్ రెహమాన్, ప్రీతమ్, అమిత్ త్రివేది తదితర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన సాంగ్స్ పాడింది.
అనిరుధ్తో కలిసి ఈమె పాడిన కావాలయ్యా, అరబిక్ కుతు లాంటి పాటలు సెన్సేషన్ సృష్టించాయి. 'కిక్ 2' మూవీలోని నువ్వే నువ్వే ప్రాణం పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. లవ్ స్టోరి, సర్కారు వారి పాట తదితర చిత్రాల్లో సాంగ్స్ పాడింది. ఓవరాల్గా చూస్తే తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్లో పాటలు పాడి మెప్పించింది. ఇన్ స్టాలో 28 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఈమె.. లైవ్ కన్సర్ట్స్తోనూ సంగీత ప్రియుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.
ఇన్నాళ్లు సింగర్గా అందరికీ తెలిసిన జోనితా గాంధీ.. అడివి శేష్ 'డకాయిట్' కోసం తొలిసారి ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేసింది. అందచందాలతో ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే సింగర్గా ఏమో గానీ డ్యాన్సర్గా మాత్రం మరింత బిజీ అవుతుందేమో అనిపిస్తుంది. ఈమె నటించిన తమిళ సినిమా 'వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్' విడుదల కావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: చిరంజీవి-ప్రభాస్ సినిమాలు.. అదొక్కటే సమస్య?)


