‘‘మేమ్ ఫేమస్’ మూవీతో యూత్లో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అయితే ‘గోదారి గట్టుపైన’ పూర్తి కుటుంబ కథా చిత్రం. ఈ సినిమాలోని వినోదం, భావోద్వేగాలు, రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఆక ట్టుకుంటాయి. ‘మేమ్ ఫేమస్’తో యూత్కి దగ్గరైన నేను ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతానని సంతోషంగా ఉంది’’ అని హీరో సుమంత్ ప్రభాస్ తెలిపారు.
సుభాష్ చంద్ర దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, నిధీ ప్రదీప్ జోడీగా నటించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్పై అభినవ్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ ప్రభాస్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సుభాష్గారు ఇప్పటికే వంద షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన చెప్పిన ‘గోదారి గట్టుపైన’ కథ నాకు బాగా నచ్చింది. గోదారి నేపథ్యంలో కథ అనగానే నాకు సవాల్గా అనిపించింది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను.
ఈ మూవీలో ఆటో డ్రైవర్గా చేశాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర నాది. జగపతిబాబుగారిది మెయిన్ క్యారెక్టర్. ‘శుభలగ్నం, ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్లో ఆయన కనిపిస్తారు. దేవీ ప్రసాద్గారు నా తండ్రి పాత్ర చేశారు. ఈ మూవీలోని లవ్, ఫాదర్–డాటర్ ఎమోషన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. నేను వదులుకున్న సినిమాల్లో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఒకటి. నా తొలి చిత్రం ‘మేమ్ ఫేమస్’కి ట్వీట్ చేసి, మహేశ్బాబు గారు సపోర్ట్ చేయడం హ్యాపీగా అనిపించింది. నేను హీరోగా నటిస్తున్న మరో సినిమా పూర్తయింది. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాను’’ అని చెప్పారు.


