త్వరలోనే కలుద్దాం: కమల్ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుడి కాలి ఎముకకు ఇన్ఫెక్షన్ కావడంతో మంగళవారం రాత్రి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ సర్జరీ విజయవంతం కావడంతో ఆయన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. 'సర్జరీ విజయవంతమైంది. శ్రీ రామచంద్ర ఆస్పత్రిలోని వైద్యబృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను కోలుకున్న వెంటనే నా అభిమానులతో మాట్లాడాలని తహతహలాడాను. ఎందుకంటే మీరు కురిపించే ప్రేమే నా మెడిసిన్. త్వరలోనే కలుద్దాం' అని రాసుకొచ్చారు. నాలుగైదు రోజుల్లో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశాలున్నాయని సన్నిహితులు పేర్కొంటున్నారు. (చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై!)
కాగా 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురవడంతో కాలుకు సర్జరీ చేశారు. ఇప్పుడు ఆ కాలు ఇన్ఫెక్షన్కు గురి కావడంతో చెన్నైలోని రామచంద్ర ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు జనవరి 19న మరోసారి శస్త్రచికిత్స జరిపారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని ఆయన కూతురు శృతిహాసన్ నిన్న సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇదిలా వుంటే ప్రస్తుతం కమల్ విక్రమ్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన కొన్ని నెలలుగా ఈ విషయంపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టిన ఆయన త్వరలోనే పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని సమాచారం. (చదవండి: నా సినిమా ఎవరు చూస్తారనుకున్నా: విజయ్)
మరిన్ని వార్తలు