హద్దులు చెరిపేసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’:కేంద్ర మంత్రి మురుగన్‌ | Indian cinema driving global influence and economic growth says Union Minister L Murugan | Sakshi
Sakshi News home page

హద్దులు చెరిపేసిన ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’:కేంద్ర మంత్రి మురుగన్‌

May 5 2025 12:57 AM | Updated on May 5 2025 12:57 AM

Indian cinema driving global influence and economic growth says Union Minister L Murugan

గడచిన 2024–25లో దేశంలో సెన్సారైన భారతీయ ఫీచర్‌ఫిల్మ్‌ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 3,445. నలభై ఏళ్ళ పైచిలుకు క్రితం 1983లో మన వద్ద కేవలం 741 చిత్రాలు సెన్సారైతే, అంతకు సుమారు అయిదురెట్లు ఎక్కువగా ఇప్పుడు సెన్సార్‌ జరుపుకున్నాయి. ఆ స్థాయిలో చిత్ర నిర్మాణం పెరిగింది. సెన్సార్‌ విధానం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా సెన్సారైన మొత్తం భారతీయ చిత్రాల సంఖ్య – 69,113. ఒకప్పుడు 2001లో ప్రైవేట్‌ ఎఫ్‌.ఎంలు కేవలం నాలుగే ఉంటే, గత ఏడాదికి అది 388కి పెరిగింది.

ఇక, ఇరవయ్యేళ్ళ క్రితం 2004–05లో దేశంలో ప్రైవేట్‌ టీవీ ఛానళ్ళ సంఖ్య 130 ఉంటే, ఇప్పుడది 908కి చేరింది. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు సైతం 15 నుంచి 531కి హెచ్చాయి. ఇలాంటి విశేషాలెన్నో ఉన్న హ్యాండ్‌బుక్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్‌. మురుగన్‌ విడుదల చేశారు. ముంబైలో ఆదివారంతో ముగిసిన నాలుగు రోజుల ‘వరల్డ్‌ ఆడియో – విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌’ (వేవ్స్‌)–2025లో భాగంగా ఆయన ప్రసిద్ధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రూపొందించిన నివేదికల్ని జనం ముందుంచారు. 

భారత ఆర్థిక వ్యవస్థపై సినిమా, టీవీ, స్ట్రీమింగ్‌ రంగాల పరిణామశీల ప్రభావాన్ని వివరిస్తూ, అమెరికాకు చెందిన ప్రతిష్ఠాత్మక ‘మోషన్‌ పిక్చర్‌ అసోసియేషన్‌’ (ఎంపీఏ) రూపొందించిన సమగ్ర నివేదికను సైతం మంత్రి ఆవిష్కరించారు. ‘‘భాషలు,ప్రాంతాల సరిహద్దులకు అతీతంగా భారతీయ కథలు అందరినీ అలరిస్తాయని మన ‘బాహుబలి’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ లాంటి చిత్రాలు నిరూపించాయి. భారతీయ సినిమా ఇవాళ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రభావం చూపుతున్నాయి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంపీఏ ఛైర్మన్‌ – సీఈఓ అయిన ఛార్లెస్‌ రివ్‌కిన్, ‘‘భారత సినీ, టీవీ, ఆన్‌లైన్‌ వీడియో సర్వీస్‌ల (స్ట్రీమింగ్‌) పరిశ్రమల వల్ల 26.4 లక్షల మందికి ఉద్యోగాలు, 6.12 వేల కోట్ల డాలర్లకు పైగా వార్షిక రాబడి లభిస్తోంది’’ అని వివరించారు.

25 శాతం వ్యూస్‌ ఓవర్సీస్‌లోనే!
నేడు డిజిటల్‌ క్రియేషన్‌ వేగంగా పెరుగుతున్న భారత్‌లో 20 నుంచి 25 లక్షల మంది క్రియాశీలక డిజిటల్‌ క్రియేటర్స్‌ ఉన్నారు. వారు 35 వేల కోట్ల డాలర్లకు పైగా వినియోగదారుల వార్షిక వ్యయం జరిగేలా ప్రభావితం చేస్తున్నారు. నిపుణులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, ఇతర దేశాలతోపోలిస్తే భారత్‌లో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌ సేవలు 40 నుంచి 60 శాతం చౌక అని నివేదికల్లో పేర్కొన్నారు. తెరపై భారతీయ కథాకథనాలకు ఎంతటి ప్రాచుర్యమంటే, ఇవాళ మన ఓటీటీ కంటెంట్‌లో దాదాపు 25 శాతం దాకా వ్యూస్‌ విదేశీ వీక్షకుల నుంచే వస్తున్నాయి. ‘‘అందుకే, సినిమా కేవలం ఆర్థిక వ్యవహారమే కాదు, దేశాల మధ్య దౌత్య, సాంస్కృతిక వారధి కూడా’’ అని మంత్రి అభిప్రాయపడ్డారు.

సాధనతోనే సాఫల్యం: ‘‘ఒకప్పుడు అవకాశాలు చాలా తక్కువ. కానీ, ఇవాళ కొత్తవాళ్ళు తమ ప్రతిభను ప్రదర్శించడానికి స్వతంత్ర వేదికలతో పాటు సోషల్‌ మీడియా ఉంది. అయితే, ఔత్సాహికులకు సాధన అవసరం. ఎప్పటికప్పుడు తమ సంగీతపోర్ట్‌ఫోలియోను సిద్ధంగా ఉంచుకొని, మెరుగులు దిద్దుకుంటేనే పైకొస్తారు. తమ గాత్రం, సంగీతం రెండూ నాణ్యంగా ఉండేలా చూసుకొంటేనే జనానికి నచ్చుతుంది. పరిశ్రమలో గుర్తింపు దక్కుతుంది.’’ – ‘వేవ్స్‌’లో ప్రముఖ గాయకుడు, మ్యూజిక్‌ కం΄ోజర్‌ హిమేశ్‌ రేషమియా

డిజిటల్‌కూ తప్పని తలనొప్పి!: థియేటర్లలోని సినిమాలకే కాదు... డిజిటల్‌ కంటెంట్‌ ఆర్థిక వ్యవస్థకు సైతం పెనుభూతంగా మారిన పైరసీ సమస్య పైనా వేవ్స్‌లో చర్చ సాగింది. అందరూ సమన్వయంతో, బహుముఖంగాపోరాడితేనే దాన్ని అరికట్టవచ్చని మీడియా, లా, సైబర్‌ సెక్యూరిటీ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2025 నుంచి 2029 మధ్య వచ్చే అయిదేళ్ళలో ఆన్‌లైన్‌ పైరసీ వల్ల పరిశ్రమ ఆదాయంలో 10 శాతం పైగాపోతుందనీ, అదే సమర్థంగా యాంటీ పైరసీ చర్యలు తీసుకోగలిగితే లీగల్‌ వీడియో సర్వీస్‌ యూజర్ల ఆదాయం 25 శాతం పెరుగుతుందనీ నిపుణులు అంచనా వేశారు. పైరసీ నివారణ చర్యలు కీలకమనీ, పైరసీదారులను ప్రాసిక్యూట్‌ చేయడంలోని ఇబ్బందుల్ని పరిష్కరించాలనీ పేర్కొన్నారు. కాగా, రానున్న జూలైలో సీబీఐ, ఇంటర్‌΄ోల్‌ సాయంతో ఐఎస్బీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ సంస్థ ప్రత్యేకంగా ‘డిజిటల్‌ పైరసీ సమ్మిట్‌’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement