వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, హాస్య నటుడు సత్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్లోని ఈ 15వ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇండియా, విదేశీ లొకేషన్స్లో ఇప్పటికే మూడు మేజర్ షూటింగ్ షెడ్యూల్స్ను పూర్తి చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. వరుణ్ తేజ్తో పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘వరుణ్ తేజ్ కెరీర్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఇది. హారర్–కామెడీ, ఇండో–కొరియన్ బ్యాక్డ్రాప్, యునిక్ కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ‘తొలి ప్రేమ’ (2018) తర్వాత వరుణ్ తేజ్–సంగీత దర్శకుడు ఎస్. తమన్ల కాంబినేషన్లో మరోసారి అదరగొట్టే ఆల్బమ్ రానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రానికి మేకర్స్ ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం కథనం సాగుతుందని సమాచారం.


