తమన్నాను నియమించడం మమ్మల్ని నిరాశకు గురిచేసింది: నటి రమ్య | Actress Ramya on Tamannaah Bhatia appointment as Mysore Sandal Soap | Sakshi
Sakshi News home page

Ramya: 'ఎలాంటి బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు'.. తమన్నా నియామకంపై నటి రమ్య

May 26 2025 6:56 PM | Updated on May 26 2025 7:13 PM

Actress Ramya on Tamannaah Bhatia appointment as Mysore Sandal Soap

కన్నడ సోప్ బ్రాండ్‌కు మిల్కీ బ్యూటీ తమన్నాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంపై ప్రముఖ నటి రమ్య స్పందించింది.  ఇప్పటికే కన్నడ భాషపై కర్ణాటకలో ఉద్యమం కూడా మొదలైంది. దీంతో కన్నడ భాష వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కన్నడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోన్న మైసూర్ శాండల్‌ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియా నియామకంపై పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఈ సందర్భంగా నటి రమ్య కూడా స్పందించడం శాండల్‌వుడ్‌లో ఆసక్తికరంగా మారింది. కన్నడ భాష మనం కోసం పోరాడుతున్న సమయంలో తమన్నా భాటియాను అంబాసిడర్‌గా నియమించడాన్ని రమ్య ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె నిలదీశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

రమ్య తన సోషల్ మీడియాలో రాస్తూ..'కేఎస్‌డీఎల్‌ని పునరుద్ధరించాలనే ఉద్దేశ్యాన్ని అభినందిస్తున్నా. కానీ ఇది కేవలం కంటితుడుపు చర్యలా అనిపిస్తోంది. ఎందుకంటే మైసూర్ శాండల్ సబ్బుకు ఐకానిక్ గుర్తింపు ఉంది. దానికి బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు (అమూల్, ఆపిల్, డవ్, అమెజాన్ లాగా).  ఉత్తరాది వినియోగదారుల మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి కన్నడిగేతరులను బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకోవడంతో స్థానిక కన్నడిగులను దూరం చేసుకున్నారు. ముఖ్యంగా మన కన్నడ భాష గర్వం కోసం మనం పోరాడుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. మైసూర్ శాండల్ అనేది కేవలం సబ్బు మాత్రమే కాదు. ఇది కర్ణాటక ప్రజల సెంటిమెంట్' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

ఈ విషయంలో తాను తమన్నాకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఆమె కేవలం సెలబ్రిటీ మాత్రమేనని తెలిపింది. కాగా.. గత వారం తమన్నా కర్ణాటక ప్రభుత్వంతో రూ.6.2 కోట్ల ఒప్పందాన్ని రెండేళ్లపాటు మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నిర్ణయంపై భారీ వ్యతిరేకత వస్తోంది. ఆ పాత్ర కోసం కన్నడ స్టార్‌ను ఎందుకు తీసుకోలేదని చాలామంది ప్రశ్నించారు. అయితే కర్ణాటకకు వెలుపల మార్కెట్లలోకి చొచ్చుకుపోవడానికి ఆమెను రంగంలోకి దించాలనే నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement