● త్వరలో అందుబాటులోకి అర్బన్ పార్క్ ● ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: వేసవిలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. ఖేడ్ పట్టణ శివారులోని కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఉన్న పథకాలను పునరుద్ధరించడం, బోర్ల మరమ్మతులు, అవసరం ఉన్న ప్రాంతాల్లో నూతన బోర్ల డ్రి ల్లింగ్, హైరింగ్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. కలెక్టర్ నిధులతోపాటు, ఎంపీ సురేశ్ షెట్కార్, తన నిధులు సైతం తాగునీటి ఎద్దడి నివారణకు కేటాయించనున్నట్లు తెలిపారు. మంజీరా మరమ్మతు పనులు జరుగుతున్నందున నీటిని వదిలేశారని దీంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పా రు. సర్పంచ్లకు తెలియకుండా కార్యదర్శులు పలు ప్రాంతాల్లో నిధులు డ్రా చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని, సర్పంచ్లకు తెలియకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి పథకాలకు విద్యుత్ పరంగా అవసరాలకు విద్యుత్ అధికారులు తీర్చాలని సూచించారు. సమీక్షలో నాయకులు వినోద్పాటిల్, రమేష్ చౌహన్, పండరీరెడ్డి, తహశీల్దార్ హసీనాబేగం, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అందుబాటులోకి అర్బన్ పార్కు
పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న అర్బన్ పార్కు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని సంజీవరెడ్డి తెలిపారు. ఉదయం పార్కులో ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించి పనులను, ఆయా ఏర్పాట్లను పరిశీలించారు.


