మెదక్ కలెక్టరేట్: 14 నుంచి ఏప్రిల్ 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్లో అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లు, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా అగ్నిమాపక అధికారి వేణు మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్, భద్రతా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఫైర్ ఆఫీసర్ శ్రీశైలం అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో సర్పంచ్ జంగం రేణుకతో కలిసి అగ్నిమాపక వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రజలు వేసవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఫైర్సిబ్బంది రాజేందర్, రాజశేఖర్, నర్సింహారెడ్డి, గోపాల్ తదితరులున్నారు.
అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం
రామాయంపేట(మెదక్): అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని స్థానిక మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అగ్నిమాపక కేంద్రంలో పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు. వేసవిలో అగ్ని ప్రమాదాల ఎక్కువగా జరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే సంబంధిత కేంద్రానికి సమాచారం అందజేయాలని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రవినాయక్, బైరం స్వప్న, డాకి శ్యామల, ఇతర నాయకులు పాల్గొన్నారు.


