రామాయంపేట(మెదక్): తెల్లరేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త అందించింది. గతంలో మాదిరిగా వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి ఇవ్వనున్నట్లు తెలిపింది. వేసవి తీవ్రతతో పాటు రాబోయే కొనుగోలు సీజన్లో గోదాంలలో బియ్యం నిల్వలకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈనిర్ణయం తీసుకుంది. ఈమేరకు మండల కేంద్రాల్లో ఉన్న గోదాంల్లోకి బియ్యాన్ని తరలించడానికి పౌర సరఫరాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో 520 రేషన్ దుకాణాలు
జిల్లాలో 520 రేషన్ దుకాణాలుండగా, మొత్తం 2,16,716 తెల్లరేషన్ కార్డుదారులున్నారు. ఈ దుకాణాల ద్వారా ప్రతినెల వినియోగదారులకు బియ్యం సరఫరా అవుతున్నాయి. గతేడాది జూన్లో కూడా ఇలాగే మూడు నెలల కోటా బియ్యాన్ని ముందస్తుగానే వినియోగదారులకు అందజేశారు. గతంలో మాదిరిగా ఈసారి కూడా రేషన్ దుకాణాలకు మూడు నెలల బియ్యం కోటాను విడతల వారీగా సరఫరా చేయనున్నట్లు తెలిసింది. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం రేషన్ దుకాణాలకు పంపితే సమస్యలు ఎదురవుతాయని, గతంలో మాదిరిగా తాము ఇబ్బందుపాలవుతామని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాక్ దించడానికి తగినంత స్థలం ఉండదని, తక్కువ సమయంలో జిల్లా పరిధిలో అన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయడానికి సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి రేషన్ బియ్యం వచ్చే నెలాఖరులోగా వినియోగదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి నెలకు ఆరు కిలోల చొప్పున మూడు నెలలకు గాను 18 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈమేరకు త్వరలో మండల స్థాయి గోదాంలకు రేషన్ బియ్యం సరఫరా అవుతుందని సమాచారం. జిల్లా పరిధిలోని రేషన్ దుకాణాలకు ప్రతినెలా 13,500 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి.
నాలుగైదు రోజుల్లో గోదాంలకు
చేరనున్న సన్న బియ్యం స్టాక్
ఏప్రిల్లో పంపిణీకి ఏర్పాట్లు
జిల్లాలో 2,16,716 రేషన్ కార్డుదారులు
ఉత్తర్వులు జారీ కాలేదు
వచ్చే నెలలో వినియోగదారులకు మూడు నెలల రేషన్ బియ్యం ఇవ్వాలనే ఆ దేశాలు ఇంకా తమ కు అందలేదు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కాగానే జిల్లా లో గోదాంలకు తద్వారా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేస్తాం.
– జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి


