పోలీసు లాఠీ.. అవ్వకు సాయం
ఆదిలాబాద్టౌన్: మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆదిలాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. బోథ్ మండల కేంద్రం నుంచి సొనాలకు వెళ్తున్న క్రమంలో ఓ వృద్ధురాలు వాహనం నుంచి కింద పడడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పటికీ ఎస్పీ విషయాన్ని గమనించి ఆమె వద్దకు చేరుకున్నారు. వాహనంలో ఉన్న ఫస్ట్ఎయిడ్ కిట్తో ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత ఎస్కార్ట్ వాహనంలో బోథ్ ఆస్పత్రికి తరలించేలా చొరవ చూపారు. కాగా ఆ వృద్ధురాలు నడవడానికి ఇబ్బందులు పడుతుండగా పోలీసుల వద్ద ఉన్న లాఠీని అందజేసి ఇలా వాహనం వరకు తీసుకెళ్లారు. ఎస్పీ చొరవను పలువురు అభినందించారు.


