
స్థానిక సమరానికి సిద్ధం!
జిల్లాలో గ్రామీణ ఓటర్లు
మహిళలు 1,90,828
పురుషులు 1,85,956
ఇతరులు 19
మొత్తం 3,76,803
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/మంచిర్యాలరూరల్ (హాజీపూర్): గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి నాయకులు సిద్ధం అవుతున్నారు. వచ్చే సెప్టెంబర్లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు నాయకులు సంస్థాగతంగా సన్నద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పేపర్ల వరకు అంతా సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో 90రోజులు గడువు ఉండడంతో నాయకులు క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాల్లో వేగిరం
అధికార కాంగ్రెస్ పార్టీ సానుకూలతను పెంచేందుకు ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచారు. ఇప్పటికే రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హుల ఎంపిక సాగుతుండగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులతో ముగ్గు పోయిస్తూ నిర్మాణాలు వేగిరం చేస్తున్నారు. మరోవైపు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందజేశారు. భూభారతి అమలు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలతను పెంచుతూ వచ్చే పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేగాక శ్రేణులను సన్నద్ధం చేసుకుంటూ పార్టీలో రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు భర్తీ చేస్తున్నారు.
పోరాడేందుకు ప్రతిపక్షాలు
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను చూపిస్తూ స్థానిక సంస్థల్లో లబ్ధి పొందేలా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు రాని బాధితులు, రాజీవ్ యువ వికాసం నిబంధనలు, భూ భారతిలో సమస్య పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు వంటివి జాప్యంపై ఇప్పటికే వినతులు, నిరసనలు చేపడుతున్నారు. తమ పార్టీల ప్రతినిధులతో కలిసి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆయా పథకాల అమలు తీరుపై ఎండగడుతున్నా రు. ప్రజావ్యతిరేకతను తీసుకొచ్చి వచ్చే పంచా యతీ, పరిషత్ ఎన్నికల్లో లబ్ధిపొందేలా ప్రణాళికలు వేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటానికి సిద్ధమవుతున్నారు.
కర్చీఫ్ వేసుకుంటున్న నాయకులు
రిజర్వేషన్ తేలకముందే ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు నాయకులు కర్చీఫ్లు వేసుకుంటున్నా రు. తాము బరిలో ఉంటామనే సంకేతాలు ఇస్తున్నా రు. జనరల్, మహిళా, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో ఆ యా నాయకులు రిజర్వేషన్లు ఉన్నవారు తమకు అనుకూలంగా ఉన్న చోట్ల బరిలో ఉంటారని ప్రజ ల్లో చెప్పుకుంటున్నారు. అయితే రిజర్వేషన్లు తేలా క, ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? లేక పరిషత్ ఎన్నికలా? అనే స్పష్టత కోసం చూస్తున్నారు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో పోటీలో ఉండబోయే నాయకులు స్థానిక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇంకా కొందరు ఏ పార్టీ నుంచి ఉండకుండా తటస్థంగా ఉంటూ సమయాన్ని బట్టి పార్టీ మద్దతు కోరే యోచనలో ఉన్నారు.
జిల్లాలో..
గత ఏడాది ఫిబ్రవరి 2నాటితో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. 17నెలలుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై చర్చ మొదలైంది. జిల్లాలోని 306 గ్రామ పంచాయతీల్లో 2,680 వార్డులు ఉన్నాయి. 16మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో నిర్వహించనుండగా.. జిల్లాలో 3,777 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. 2019జనవరిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులతోపాటు మహారాష్ట్రకు చెందిన బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల మరమ్మతు పూర్తి చేసి పోలింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే పంచాయతీల వారీగా పంపిస్తారు. బ్యాలెట్ పేపర్లు సైతం సిద్ధంగా ఉంచారు.
పోటీ చేసే స్థానాలపై ప్రణాళికలు
ముందుగానే కర్చీఫ్లు వేస్తున్న నాయకులు
రిజర్వేషన్లు తేలితే పల్లెల్లో ఎన్నికల వేడి