సమన్వయం.. సవాలే! | - | Sakshi
Sakshi News home page

సమన్వయం.. సవాలే!

Jun 26 2025 10:05 AM | Updated on Jun 26 2025 10:05 AM

సమన్వ

సమన్వయం.. సవాలే!

● ‘హస్తం’లో గ్రూపు విభేదాలు ● నామినేటెడ్‌, పార్టీ కమిటీల ఏర్పాటులో జాప్యం ● ముంచుకొస్తున్న ‘స్థానిక’ సమరం ● నేడు ఆదిలాబాద్‌కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ‘జూపల్లి’ రాక ● రెండ్రోజులపాటు ఇక్కడే మకాం ● ఆయన వెంట మంత్రి వివేక్‌ సైతం..

సాక్షి,ఆదిలాబాద్‌: ‘పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశపర్చొద్దు.. సమన్వయంతో ముందుకు సాగా లి.. ప్రభుత్వ పదవులను శ్రేణులకు ఇప్పించడంలో జాప్యం అయితే ప్రయోజనమేంటి.. ఆలయ, మార్కెట్‌ కమిటీలు వంటి పదవులు నేరుగా నేను ఇవ్వలేను.. ఇన్‌చార్జి మంత్రులు, షార్ట్‌లిస్ట్‌ చేసి పంపితే ఫైనల్‌ మాత్రమే చేయగలుగుతాను.. నామినేటెడ్‌తో పాటు పార్టీ కమిటీలు ఇవ్వడంలో ఇక ఆలస్యం వద్దు.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలి.. అది జరిగితే త్వరగా ఫైనల్‌ చేయవచ్చు..’ ఇది సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీపీసీసీ పీఏసీ భేటిలో అన్న మాటలు. ప్రస్తుతం ఇవి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ఇన్‌చార్జి మంత్రులకు ప్రస్తుతం పార్టీ పరంగా వీటన్నింటిని సరిదిద్ది, గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది.

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎకై ్స జ్‌, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. నేడు, రేపు ఆయన ఇక్కడే ఉండనున్నారు. ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొననున్నారు. అలాగే ఇన్‌చార్జి మంత్రికి తొలుత పార్టీ సంస్థాగత నిర్మాణం, నామినేట్‌ పదవుల పందెరం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం ముందున్న బాధ్యత. సీఎం ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు దృష్టి సారించాలని ఆదేశించడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటుపై ఆయన తక్షణం దృష్టి సారించాల్సిన పరిస్థితి. అలాగే పార్టీలో గ్రూపు విభేదాలతో పాటు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో మంత్రి వీటన్నింటిని ఎలా గాడిలో పెడతారనేది ఆసక్తికరం. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కార్యకర్తల్లో తాము అధికారంలో ఉన్నామన్న ఉత్సాహం కనిపించడం లేదు. అధికారుల వద్ద తమ పనులు కాాకపోవడం కూడా ఈ నిరాశకు కారణం. ఈ నేపథ్యంలో పార్టీలో ఉత్సాహం తీసుకురావడం ప్రస్తుతం ఇన్‌చార్జి మంత్రికి కీలకం కానుంది.

సమన్వయం సాధించేనా..

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రతీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయ లోపం ఉంది. గతంలో ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించిన సీతక్క వీరందరినీ సమన్వయ పర్చడంలో విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా ఆమె అసలు పట్టించుకోలేదని నేరుగా జిల్లా నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ముందు ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ప్రస్తావించారు. ఆ సమయంలోనే తాను ఉమ్మడి ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరించలేనని, తప్పుకుంటానని, విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని అప్పట్లోనే ఆమె పేర్కొనడం గమనార్హం. ఆ తర్వాత పరిణామ క్రమంలో నిజామాబాద్‌ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి జూపల్లిని ఆదిలాబాద్‌కు, సీతక్కను నిజామాబాద్‌కు మార్చారు. ఈ పరిస్థితుల్లో మంత్రి జూపల్లి తొలిసారిగా జిల్లాకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో సమన్వయం ఎలా సాధించాలనే విషయంలో ఆయన ఎలా ముందుకెళ్తారనేది ప్రస్తుతం కీలకం. ఇక చెన్నూర్‌ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గడ్డం వివేక్‌ వెంకటస్వామి రాష్ట్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. మంత్రి హోదాలో ఆయన కూడా గురువారం నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి రానున్నారు.

ఇదీ పరిస్థితి..

ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్ష పదవి రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో జిల్లాలో పార్టీకి దిక్సూచి లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, బోథ్‌, ఆసిఫాబాద్‌లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన నేతలు కంది శ్రీనివాస్‌రెడ్డి, ఆడే గజేందర్‌, శ్యామ్‌నాయక్‌ ఆయా నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఖానాపూర్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు ప్రస్తుతం ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఏకైక కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఇక నిర్మల్‌ జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా శ్రీహరిరావు వ్యవహరిస్తున్నారు. సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీహరిరావు మధ్య పార్టీ పరంగా సరైన సంబంధాలు లేవు. ముధోల్‌ నియోజకవర్గంలో సీనియర్‌ నేతలు బోస్లే నారాయణరావు పటేల్‌, విఠల్‌రెడ్డి మధ్య సఖ్యత కరువైంది. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ మధ్య కూడా ఇదే పరిస్థితి. కుమురంభీం జిల్లాలోనూ పార్టీ నేతల మధ్య విభేదాలున్నాయి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఇటీవల మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు తాను దూరంగా ఉంటానని ప్రకటించారు. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ విఠల్‌తో విభేదాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి శ్రీనివాస్‌, దండే విఠల్‌కు మధ్య కూడా సఖ్యత లేదు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యామ్‌నాయక్‌ మధ్య విభేదాలున్నాయి. ఇక మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇటీవల మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు వ్యాఖ్యలు దుమారం లేపాయి. ప్రధానంగా ‘నా నియోజకవర్గానికి నేనే రాజు.. నేనే మంత్రినని’ ఆయన పేర్కొనడం పార్టీలో విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ జిల్లాలోని చెన్నూర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వివేక్‌ ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తారనేది చూడాల్సిందే. ఇలా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పరిస్థితులను ఇన్‌చార్జి మంత్రి ఎలా సరిదిద్దుతారనే విషయంలో పార్టీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

సమన్వయం.. సవాలే!1
1/2

సమన్వయం.. సవాలే!

సమన్వయం.. సవాలే!2
2/2

సమన్వయం.. సవాలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement