మెడికల్‌ బోర్డు పిలుపు ఎప్పుడో..? | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ బోర్డు పిలుపు ఎప్పుడో..?

Jun 25 2025 7:18 AM | Updated on Jun 25 2025 7:18 AM

మెడికల్‌ బోర్డు పిలుపు ఎప్పుడో..?

మెడికల్‌ బోర్డు పిలుపు ఎప్పుడో..?

● 3 నెలలుగా నిర్వహించని సమావేశం ● సింగరేణి వ్యాప్తంగా 700 మంది నిరీక్షణ ● ఆందోళనలో హయ్యర్‌ సెంటర్‌ రిఫరల్‌ కేసు బాధితులు

శ్రీరాంపూర్‌:సింగరేణి కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డు సమావేశం నిలిచిపోయింది. మూడు నెలలుగా బోర్డు సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో జబ్బుపడిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకోసారి మెడికల్‌ బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2025, మార్చి 21న నిర్వహించిన మెడికల్‌ బోర్డు మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీంతో మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులు నిరీక్షిసున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులు ఇక తాము డ్యూటీలు చేయలేమని భావిస్తే మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగ విరమణ తేదీకి కనీసం రెండేళ్ల ముందు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు, కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడిన వారంతా కూడా బోర్డుకు దరఖాస్తు చేసుకుంటారు. దీంతో పాటు గనులు, బయట ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఏరియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా ఏరియా వైద్యాధికారులు కార్పొరేట్‌ మెడికల్‌ బోర్డుకు రెఫర్‌ చేస్తారు.

హయ్యర్‌ సెంటర్‌ రిఫరల్‌ కేసులు..

హయ్యర్‌ సెంటర్‌ రిఫరల్‌ బాధిత కార్మికులను హై దరాబాద్‌లోని నిమ్స్‌, ఇతర ప్రముఖ ఆస్పత్రులకు కంపెనీ రెఫర్‌ చేస్తుంది. ఇలా రిఫరల్‌ అయిన కార్మి కులు అక్కడ చేయించుకున్న వైద్య పరీక్షల రిపోర్టును కంపెనీకి సమర్పిస్తారు. వారిని మెడికల్‌ బోర్డుకు పిలిచి వైద్యపరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన మెడికల్‌ బో ర్డుకు ముందు మూడు నెలల నుంచి ఇలాంటి కేసులను బోర్డుకు పిలువలేదు. ఇలా ఆరు నెలలుగా హయ్యర్‌ సెంటర్‌ రిఫరల్‌ కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. దీంతో తాము వేతనాలు కోల్పోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు.

700 మంది నిరీక్షణ..

సింగరేణి వ్యాప్తంగా సుమారు 700 మంది కార్మికులు మెడికల్‌ బోర్డు పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. మెడికల్‌ బోర్డుకు వెళ్లిన కేసులను అక్కడి వైద్యబృందం, అధికారులు పరీక్షిస్తారు. వారికి ఉన్న జబ్బుల తీవ్రతను బట్టి అండర్‌ గ్రౌండ్‌లో పనిచేయలేని వారిని అన్‌ఫిట్‌ చేసి సర్ఫేస్‌లో డ్యూటీ ఇస్తారు. పూర్తిగా పని చేయలేరని భావించిన వారిని ఇన్వాలిడేషన్‌ చేస్తారు. దీని కింద కార్మికుని డిపెండెంట్లకు కారుణ్య ఉద్యోగం వస్తుంది.

సమావేశం నిర్వహించాలి

సింగరేణి యాజమాన్యం ఇకనైనా ఆలస్యం చేయకుండా వెంటనే మెడికల్‌ బోర్డు నిర్వహించాలి. నెలకోసారి నిర్వహించాల్సిన బోర్డును ఇప్పటికీ మూడు నెలలుగా నిర్వహించకపోవడంతో వ్యాధుల భారిన పడిన కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

– కే.వీరభద్రయ్య, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement