
ఏటీఎంలో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో సంచలనం సృష్టించిన ఏటీఎంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ ఎగ్గడి భాస్కర్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రవికుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన జేసీబీ ఆపరేటర్లు మహ్మద్ ముస్తాఫా, షాహీద్, వారి సహచరులైన ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్తో కలిసి ఏటీఎంలోకి వెళ్లి మిషన్ క్యాషెట్ను గ్యాస్కట్టర్తో కట్ చేశారు. అంతలోనే పోలీస్ సైరన్ వినిపించడంతో క్యాషెట్ను (రూ.30వేల)ను పట్టుకెళ్లారు. ఏటీఎం నిర్వహాకులు సీఎంఎస్ కంపెనీకి చెందిన అసిస్టెంట్ మేనేజర్ శివకుమార్ ఫిర్యాదుతో బెల్లంపల్లి టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం బెల్లంపల్లి కెమికల్ ప్రాంతంలో మహ్మాద్ ముస్తాఫా, షాహిద్ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు బైక్లు, గ్యాస్ కట్టర్, గ్యాస్ సిలిండర్తో పాటు ఏటీఎంలోని క్యాషెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆలీంఖాన్, సాజిద్, అప్తాబ్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితులు మహారాష్ట్రలోని అహేరిలో పల్సర్ బైక్, మంచిర్యాలలో షైన్ బైక్ను దొంగలించారు. కాగజ్నగర్లో గ్యాస్ కట్టర్, కౌటాలలో గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేశారు. కేసును ఛేదించిన బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్, టూటౌన్ ఎస్సై కే.మహేందర్, నెన్నెల ఎస్సై ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ సాయికృష్ణ, హోంగార్డు సంపత్ను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు.