
బ్రాండెడ్ పేరిట రాయితీ బియ్యం విక్రయం
● ముగ్గురు వ్యాపారులపై కేసు ● పరారీలో ఒకరు
ఆదిలాబాద్టౌన్: బ్రాండెడ్ రైస్ పేరుతో ప్రభుత్వ రాయితీ బియ్యం విక్రయిస్తున్న ఘరానా ముఠాను మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఎస్పీకి అందిన సమాచారం మేరకు జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో దుకాణాలను తనిఖీ చేయగా ఇద్దరు వ్యాపారుల వద్ద 80 క్వింటాళ్ల రాయితీ బియ్యం బ్రాండెడ్ బ్యాగుల్లో వేసి ప్రజలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. శివాజీ చౌక్లోని రజిత కిరాణంకు చెందిన గాగుల్వార్ రాజేశ్వర్, ఆంధ్ర కిరాణంకు చెందిన షేక్ అయ్యుబ్లను అరెస్టు చేశారు. చిల్కూరి లక్ష్మీనగర్కు చెందిన షేక్ అస్లమ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మార్కెట్లో మంచి బ్రాండ్గా ఉన్న జై శ్రీరామ్, గోల్డెన్, సైకిల్బ్రాండ్, సూర్యతేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ప్లాటినం, శ్రీదత్త అనే పేర్లతో ఉన్న ఖాళీ సంచుల్లో పీడీఎస్ రైస్ నింపి మిషన్తో సీల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై అశోక్, సిబ్బంది పాల్గొన్నారు.