
వేధింపులతో యువకుడు ఆత్మహత్య
● వ్యాపారి ఇంటి ఎదుట బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన
పెంచికల్పేట్: వ్యాపారి వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని అగర్గూడలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తుమ్మిడే రాజశేఖర్ (22) కొంతకాలంగా ఎల్కపల్లి గ్రామానికి చెందిన వ్యాపారి కృష్ణ ఎరువుల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తన సోదరి డెలివరీకి ఉండగా నాలుగురోజుల పాటు దుకాణానికి వెళ్లలేదు. సోమవారం విధులకు హాజరుకావడంతో కోపోద్రికుడైన వ్యాపారి తీవ్ర పదజాలంతో ధూషించడంతో పాటు డబ్బులు దొంగిలించాడని హేళనగా మాట్లాడాడు. బాకీ ఉన్న రూ.10వేలు ఇవ్వాలనగా ఫోన్పే ద్వారా చెల్లించాడు. అంతేకాకుండా కేసు పెడతానని ఫోన్లో కుటుంబ సభ్యులను బెదిరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అగర్గూడ సమీపంలోని పంట చేనులో గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా కాగజ్నగర్, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరవుతోంది. ఘటనకు కారకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యాపారి ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్రావు, ఎస్సై కొమురయ్య బందోబస్తు ఏర్పాటు చేశారు.

వేధింపులతో యువకుడు ఆత్మహత్య