భూసారమెంతో తేలనుంది..! | - | Sakshi
Sakshi News home page

భూసారమెంతో తేలనుంది..!

Jun 24 2025 4:05 AM | Updated on Jun 24 2025 4:05 AM

భూసార

భూసారమెంతో తేలనుంది..!

● కొనసాగుతున్న మట్టినమూనాల సేకరణ ● జిల్లాలో 1875మంది రైతుల ఎంపిక

చెన్నూర్‌రూరల్‌: నేల స్వభావాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా పంటలు సాగు చేయించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల్లో ఈ నెలలో వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించి మట్టి నమూనాలు సేకరిస్తోంది. నాచురల్‌ ఫార్మింగ్‌, సాయిల్‌ హెల్త్‌ ఫెర్టిలిటి పథకం పీఎం రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన కింద సాగు భూముల్లో భూసార పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలను రైతులకు అందజేయనున్నారు. నాచురల్‌ ఫార్మింగ్‌ కింద జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కో మండలానికి 125మంది రైతుల చొప్పున జిల్లా వ్యాప్తంగా 1875మందిని ఎంపిక చేశారు. ఆయా రైతుల సాగుభూముల్లోని మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్‌లోని భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నారు. ఇప్పటివరకు 1600 మట్టినమూనాలు సేకరించి పంపించారు. సాయిల్‌ హెల్త్‌ అండ్‌ ఫెర్టిలిటి పథకం కింద ఒక్క చెన్నూర్‌ మండలంలో మాత్రమే 2125మంది రైతుల పంట పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల నిమిత్తం పంపిస్తారు. ఇప్పటివరకు 800 రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి పంపించారు. పరీక్షించిన తర్వాత ఫలితాలను ఈ నెల చివరి వరకు అందజేస్తారు.

సేకరించే విధానం

ఏఈవోలు రైతుల పొలాల్లోకి వెళ్లి జియో ట్యాగింగ్‌ చేసి మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. నాలుగు మూలల్లో, పొలం మధ్యలో వీ ఆకారంతో ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు తవ్వి మట్టిని తీయాలి. సేకరించిన మట్టిలో చెత్తాచెదారం లేకుండా, గడ్డలు లేకుండా పొడిగా చేయాలి. మట్టిని చతురస్రాకారంలో పరిచి మూలలకు ఎదురుగా ఉన్న మట్టిని తీసుకుని అరకిలో వరకు సేకరించాలి. ఆ మట్టిని ప్లాస్టిక్‌ కవర్‌లో వేసి రైతు వివరాలతో భూసార పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. పరీక్షల అనంతరం భూమిలో ఎలాంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి, భూసారం ఎలా ఉందో గుర్తించి ఎలాంటి సూక్ష్మ పోషకాలు అందించాలి, ఏ పంట సాగు చేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వేయాలో రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తారు.

భూసార పరీక్షలతో మేలు

ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో ఏఈవోలు మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. భూసార పరీక్షలతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. భూమిలో సారం ఎంత ఉందో తెలుసుకోవచ్చు. నేలకు అనుగుణంగా ఏ పంట వేసుకోవాలో, అధిక దిగుబ డులు ఎలా పొందాలో తెలిసిపోతుంది. రైతులు తప్పనిసరిగా మట్టి నమూనాల సేకరణకు సహకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలి.

– బానోతు ప్రసాద్‌, ఏడీఏ, చెన్నూర్‌

భూసారమెంతో తేలనుంది..!1
1/1

భూసారమెంతో తేలనుంది..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement